Mon Oct 07 02:13:07 UTC 2024: ## భారత షూటర్లు ప్రపంచ జూనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో మెరిశారు

లిమా (పెరూ): ప్రపంచ జూనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. శనివారం భారత్‌ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు చేరాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో మన షూటర్లు క్లీన్‌స్వీప్‌ చేస్తూ మూడు పతకాలు ఖాతాలో వేసుకోగా… ఆంధ్రప్రదేశ్‌ షూటర్‌ ముకేశ్‌ నేలవల్లి ఓవరాల్‌గా ఐదో పతకంతో సత్తా చాటాడు. ఇప్పటికే ఈ టోర్నీలో నాలుగు స్వర్ణాలు గెలిచిన గుంటూరు జిల్లాకు చెందిన ముకేశ్‌… పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించాడు.

భారత్‌కే చెందిన సూరజ్‌ శర్మ 571 పాయింట్లతో బంగారు పతకం కైవసం చేసుకోగా… 568 పాయింట్లతో ముకేశ్‌ కాంస్యం గెలుచుకున్నాడు. మహిళల ఫైనల్లో దివాన్షి 564 పాయింట్లు సాధించి అగ్ర స్థానం దక్కించుకోగా… భారత్‌కే చెందిన పారిశా గుప్తా 557 పాయింట్లతో రజత పతకం సాధించింది. ఇదే విభాగంలో భారత షూటర్‌ మాన్వి జైన్‌ 557 పాయింట్లతో కాంస్యం దక్కించుకోవడంతో మూడు పతకాలు మన ఖాతాలోనే చేరాయి.

దీంతో ఈ టోర్నీ చరిత్రలో భారత షూటర్లు తొలిసారి ఒక విభాగంలో మూడు పతకాలను క్లీన్‌స్వీప్‌ చేసిన ఘనత సాధించారు. దివాన్షికి ఈ పోటీల్లో ఇది ఐదో పతకం కావడం విశేషం. ఈ టోర్నీలో భారత్‌ 21 పతకాలతో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇందులో 13 స్వర్ణాలు, రెండు రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి.

Read More