Sat Oct 12 14:00:00 UTC 2024: ## సూర్యకుమార్ యాదవ్ 2500 పరుగుల క్లబ్లో చేరేందుకు సిద్ధం
హైదరాబాద్: భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ20ల్లో మరో అరుదైన మైలురాయికి చేరువయ్యాడు. బంగ్లాదేశ్తో ఇవాళ (అక్టోబర్ 12) జరుగబోయే మ్యాచ్లో స్కై మరో 31 పరుగులు చేస్తే 2500 పరుగుల క్లబ్లో చేరతాడు. భారత్ తరఫున కేవలం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మాత్రమే 2500 పరుగుల మార్కును దాటారు.
ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ ఖాతాలో 2469 పరుగులు ఉన్నాయి. భారత్ తరఫున అత్యధిక టీ20 పరుగుల రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్మ్యాన్ పొట్టి ఫార్మాట్లో 4231 పరుగులు చేశాడు. రోహిత్ తర్వాత భారత్ తరఫున అత్యధిక పరుగుల రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. కోహ్లి 125 మ్యాచ్ల్లో 4188 పరుగులు చేశాడు.
టీ20 వరల్డ్కప్-2024 విజయానంతరం రోహిత్, కోహ్లి అంతర్జాతీయ టీ20లకు గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, భారత్-బంగ్లాదేశ్ మధ్య హైదరాబాద్ వేదికగా ఇవాళ మూడో టీ20 జరుగనుంది. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్కు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుంటే భారత్కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్లు టీమిండియానే గెలిచింది. మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది.