Fri Oct 11 01:48:21 UTC 2024: ## ఢిల్లీ: సీఎం నివాసం స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నం – అతిషి
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి గురువారం మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ తమ పార్టీని గెలిపించుకొని సీఎం పదవిని పొందే సత్తాలేక ఢిల్లీ సీఎం నివాసాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఆప్ నేతలు ప్రజల హృదయాల్లో నివసిస్తారని, బీజేపీ కోరుకుంటే ఆ బంగ్లాను వారే ఉంచుకోవచ్చని అన్నారు.
ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వాన్ని అణగదొక్కేందుకు బీజేపీ అనేక వ్యూహాలను రచిస్తోందని అతిషి ఆరోపించారు. ఓడిపోయిన రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తుందని అన్నారు.
“ఎన్నికల్లో మమ్మల్ని ఓడించలేమని బీజేపీ ఆందోళన చెందుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైనప్పుడు.. బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ను ఆశ్రయిస్తుంది. పార్టీ చేరని నేతలను జైల్లో పెడతారు. సొంతంగా ముఖ్యమంత్రిని గెలిపించుకోలేక ఇప్పుడు సీఎం నివాసాన్ని సీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. విలాసవంతమైన కార్లు, బంగ్లాలలో నివసించేందుకు మేం రాజకీయాల్లోకి రాలేదు. అవసరమైతే వీధుల్లోంచి పాలన చేస్తాం. బీజేపీ వాళ్లు బంగ్లాలో ఆనందించవచ్చు. మేము ప్రజల హృదయాలలో జీవిస్తున్నాం’’ అని అతిషి అన్నారు.
ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించిన అతిషికి ఇంకా అధికారిక బంగ్లా కేటాయించకపోవడంపై వివాదం నెలికొంది. దీంతో సీఎం హోదాలో గతంలో అరవింద్ కేజ్రీవాల్కు కేటాయించిన ఢిల్లీలోని ఫ్లాగ్స్టాఫ్ రోడ్డు, నంబర్ 6 అధికారిక బంగ్లాలోకి అతిషి మారారు. దీంతో ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ తన అధికారాన్ని ఉపయోగించి అతిషికి సంబంధించిన సామగ్రిని బయట పడేశారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది.